కేసీఆర్ కుర్చీ కదులుతుందనే మంత్రి కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్కి వెళ్లారని అన్నారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయన్నారు. పత్రికల్లో, మీడియాలో రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని ఆరోపించారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ను ఎవరూ నమ్మరని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. రూ.100 కోట్ల లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్పై విచారణ జరిపిస్తున్న మోదీ.. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ను ఎందుకు విచారణ చేయడంలేదు? ప్రశ్నించారు. నిన్న వెళ్లి నడ్డాను, అమిత్ షాను కలిసి వచ్చిన బీజేపీ నాయకులు ఇంకా భ్రమలు పెట్టుకోవద్దని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ, బీఆర్ఎస్ది తమరు అనుకుంటే తెగిపోయే బంధం కాదని, ఫెవికాల్ బంధమని ఎద్దేవా చేశారు. ‘‘ మీరు ఎంత కంఠశోష పెట్టుకున్నా మీ మాట ఎవరూ వినరు. తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.









