షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కూల్చేస్తామంటూ కామెంట్స్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను కూల్చివేస్తామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన ఇళ్లు శిధిలావస్థకు చేరుకున్నాయని, ఎప్పుడు కూలిపోతాయో కూడా అర్థం కావడం లేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత లేకుండా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను కూల్చేసి కొత్త ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు.
లబ్ధిదారులు డబుల్ బెడ్రూం ఇళ్లల్లోకి వెళ్లకముందే పగుళ్లు ఏర్పడుతున్నాయని, ఇళ్లల్లోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని షబ్బీర్ అలీ విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల గోడలకు ఏర్పడిన పగుళ్లను కర్రముక్కతో కదిలిస్తే పెచ్చులూడుతున్నాయని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లను సమర్ధవంతంగా నిర్మించడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యతతో నిర్మించి పేదలకు ఇస్తామని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.
అయితే కామారెడ్డి నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం మొదలైంది. నాలుగు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా టేక్రియాల్లోని డబుల్ బెడ్రూం ఇళ్లను షబ్బీర్ అలీ పరిశీలించారు. ఈ సందర్బంగా పగుళ్లు ఏర్పడుతున్నాయంటూ ఆరోపించారు. వీటి నాణ్యతపై ఎమ్మెల్యేతో చర్చకు సిద్దమని సవాల్ చేశారు. తాను ఇంజినీర్లను తీసుకొస్తానని, ఎమ్మెల్యే కూడా ఇంజినీర్లను తీసుకురావాలని చెప్పారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే గంప గోవర్దన్ స్పందించారు. షబ్బీర్ అలీ ఆరోపణలపై తాను కూడా చర్చకు సిద్దమని ప్రకటించారు. షబ్బీర్ అలీ వస్తే కామారెడ్డి అభివృద్ధి చూపిస్తానంటూ సవాల్ చేశారు. ఇరు పార్టీల నేతల సవాళ్లతో కామారెడ్డి రాజకీయం వేడెక్కింది.
గంప గోవర్ధన్ వ్యాఖ్యలతో సోమవారం షబ్బీర్ అలీ టేక్రియాల్కు చేరుకుని ఎమ్మెల్యే చర్చకు రావాలని కోరారు. అనుచరులతో కలిసి టెంట్ వేసుకుని కూర్చున్నారు. ఎమ్మెల్యే కోసం చాలాసేపు ఎదురుచూశారు. అయితే ఎమ్మెల్యే చర్చకు రాకపోవడంతో అక్కడే ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యమైన ఇళ్లను కట్టి చూపించాలని కోరారు.