AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెరువులకు జియో ట్యాగింగ్..! నెల్లికల్, రేషన్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటనలు..!

చెరువుల పూర్తి నీటిమట్టం ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) హద్దులపరిరక్షణపై రాజీపడబోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుతామని, జలవనరుల ఆక్రమణలను ఉపేక్షించబోమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. చెరువు నిండితే పల్లె పచ్చబడుతుందని, మత్స్యకారుడి వల నిండితే అతని కుటుంబంలో వెలుగులు విరుస్తాయని, అందుకే చెరువులు, కుంటలు, ఇతర జలవనరుల పరిరక్షణతోపాటు వాటిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల జీవనోపాధిని కాపాడటాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా భావిస్తోందన్నారు.

శాసన మండలిలో శుక్రవారంఆయన మాట్లాడుతూ చెరువుల ఎఫ్‌టీఎల్‌ హద్దులు దెబ్బతిన్నా, జలవనరులు ఆక్రమణలకు గురైనా, వాటిపై ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాలకు నష్టం వాటిల్లినా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. సభ దృష్టికి తీసుకొచ్చిన నిర్దిష్ట సమస్యను నీటిపారుదల శాఖ అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. వారం రోజుల్లోగా సంబంధిత చెరువును సందర్శించి, జలవనరుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, స్థానిక మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో సుమారు 2,150గా ఉన్న మత్స్య సహకార సంఘాల సంఖ్య ప్రస్తుతం ఆరు వేలకు పైగా పెరిగిందన్నారు. సంఘాల సభ్యత్వం సుమారు 2 లక్షల నుంచి 6.5 లక్షలకు చేరిందని వివరించారు. జలవనరుల ఆరోగ్యంతోనే మత్స్యకారుల జీవనోపాధి ముడిపడి ఉన్నందున, చెరువుల పర్యవేక్షణ, చేప పిల్లల సంరక్షణ, ఆక్రమణలు లేదా ఇతర ముప్పులను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మత్స్యకార సంఘాలు స్థానిక సంరక్షకులుగా సమర్థవంతమైన పాత్ర పోషించగలవని సూచించారు.

రాష్ట్రంలోని అన్ని చెరువులకు పరిరక్షణ, నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని మంత్రి వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇటువంటి కమిటీలు పనిచేశాయని, అనంతర కాలంలో ఆ వ్యవస్థ నిలిచిపోయిందని తెలిపారు. జలవనరుల సమర్థ నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ, ఆక్రమణల నిరోధానికి కమిటీల వ్యవస్థను పునరుద్ధరించాలని వచ్చిన సిఫారసుల మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 44 వేల చెరువులకు జియో ట్యాగింగ్‌ పూర్తయిందని తెలిపారు. ఈ సమగ్ర సమాచార వ్యవస్థ చెరువుల స్థితిగతులను పర్యవేక్షించడంతోపాటు వాటి పరిరక్షణకు అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకు బలమైన ప్రాతిపదికగా ఉపయోగపడుతుందని చెప్పారు.చెరువుల పరిరక్షణకు అదనపు నిధులు అవసరమైతే వాటిని సమకూర్చేందుకు ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు. చెరువుల సంరక్షణ, ఎఫ్‌టీఎల్‌ హద్దుల పరిరక్షణ, మత్స్యకారుల జీవనోపాధికి భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్య అంశాలని పునరుద్ఘాటించారు.

నల్లగొండ జిల్లాలోని నెల్లికల్‌ ఎత్తిపోతల పథకాన్ని డిసెంబర్‌ 2027 నాటికి సంపూర్ణంగా పూర్తి చేసి, సుమారు 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నెల్లికల్‌ ను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా గుర్తించిందని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశించుకున్న గడువులోగా రెండు దశలను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. తొలి దశలో జూన్‌ 2027 నాటికి 7,800 ఎకరాలకు సాగునీరు అందిస్తామని, మిగిలిన సుమారు 16 వేల ఎకరాలకు డిసెంబర్‌ 2027 నాటికి నీరందించి మొత్తం 24 వేల ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు.గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం పనులకు కేవలం రూ.25.42 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని మంత్రి తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు రూ.310.681 కోట్లు విడుదల చేసి, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు పనులకు వేగం పెంచిందన్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం అందిస్తున్న బియ్యం, గోధుమలు, చక్కెరతోపాటు మరికొన్ని నిత్యావసర సరుకులను పంపిణీ చేసే ప్రతిపాదనను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని వెల్లడించారు. పీడీఎస్‌ పరిధిలోకి అదనపు సరుకులను తీసుకురావడం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అందుకు అవసరమయ్యే ఆర్థిక భారాన్ని సమగ్రంగా అంచనా వేస్తున్నామని తెలిపారు. దీనివల్ల పేదల ఆహారంలో పోషక విలువలు పెరగడంతోపాటు రాష్ట్రంలో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.

ANN TOP 10