ఆంధ్రుల కలల రాజధాని అమరావతి గ్లోబల్ బ్రాండ్ దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం సీఎం చంద్రబాబు పడుతున్న కష్టానికి ఫలితం దక్కుతోంది. తాజాగా రాజధాని అమరావతిపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ అమరావతిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. పనులు విషయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వేగంగా జరుగుతున్నాయి. గురువారం ప్రజాప్రతినిధుల టవర్స్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. దాన్ని జీఏడీకి అప్పగించారు కూడా. మరోవైపు విజయవాడ సిటీ నుంచి అమరావతికి వచ్చే సీడ్ యాక్సెస్ రోడ్డును ఓపెన్ చేశారు. అమరావతిని ఆపడం ఎవరి తరం కాదని తేల్చి చెప్పేశారు సీఎం చంద్రబాబు. ఇదే సమయంలో న్యూయార్స్ టైమ్స్ పత్రిక ‘One Man’s Quest to Build India’s Most Livable City’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ ఆర్టికల్ను సీఎం చంద్రబాబు సోషల్మీడియా వేదికగా షేర్ చేశారు.
అమరావతి పట్ల మా ఆశయం కేవలం ఒక గొప్ప రాజధానిని నిర్మించడం మాత్రమే కాదు.. దేశంలో కొత్త జీవన ప్రమాణాన్ని నెలకొల్పడం లక్ష్యమన్నారు. పచ్చదనంతో అందరినీ కలుపుకొనిపోయేలా, రోజువారీ జీవన నాణ్యతను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడిన నగరమని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి పట్టణ జీవనం అనేది ఒక సుదూర ఆదర్శం కాదని నిరూపించే నగరాన్ని భారతదేశం నిర్మించగలదు, అమరావతి దాన్ని ఎలాగో చూపిస్తుందన్నారు. ఈ దార్శనికత వల్ల ది న్యూయార్క్ టైమ్స్లో ప్రచురితమవడం చూసి సంతోషంగా ఉందన్నారు. మా లక్ష్యం ఉన్నతమైనదే అయినా అది సాధించదగినదని రాసుకొచ్చారు. అమరావతి.. దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు.
న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు ముజిబ్ మషాల్-హరి కుమార్ అమరావతి గురించి రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన కలల రాజధాని అమరావతిని జలమార్గాలు, సైకిల్ లేన్లు, క్వాంటం వ్యాలీ టెక్ హబ్తో 25 వేల మంది కార్మికులతో నిర్మిస్తున్నారని రాసుకొచ్చారు. ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నగర నిర్మాణ ప్రాజెక్ట్ని జర్నలిస్టులు సందర్శించారని పేర్కొన్నారు. భారతదేశపు అతిపెద్ద క్వాంటం కంప్యూటర్కు ఆతిథ్యం ఇచ్చే భవనాన్ని ఇంజనీర్లు నిర్మించే ప్రక్రియలో ఉన్నారని ప్రస్తావించారు. కొత్త నగరంలో అరవై శాతం నీరు లేకుంటే పచ్చదనంతో నిండి ఉంటుందని అంచనా. దాదాపు 2,000 మైళ్ల సైక్లింగ్ లేన్లు ఉన్నట్లు పేర్కొన్నాయి.









