ఒడిశాలోని పూరీలో గురువారం జరిగిన జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా ఏర్పడిన తొక్కిసలాట లాంటి పరిస్థితుల్లో ఊపిరాడక ఒకరు మరణించినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, పూరీలోని మారిచికుండ్ కూడలి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. భక్తులను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన తాళ్ల బారికేడ్ కూలిపోవడం లేదా కొందరు భక్తులు పట్టుతప్పి కింద పడిపోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. సుమారు 40 నుంచి 50 మంది ఒకేచోట పడిపోవడంతో పలువురు గాయపడ్డారు. వారిలో నలుగురైదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే స్పందించి సుమారు 20 మందిని రక్షించి అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ ఒక వృద్ధుడు మరణించినట్లు తెలిసిందని వారు పేర్కొన్నారు.
భారీ జనసందోహం, కుండపోత వర్షం కారణంగా ఊపిరాడక, ఇతర గాయాలతో సుమారు 200 మంది భక్తులు పూరీలోని ఆసుపత్రులలో, తాత్కాలిక వైద్య శిబిరాల్లో చేరినట్లు సమాచారం. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు, గురువారం ఉదయం షెడ్యూల్ కంటే ముందుగానే పహండీ బిజే క్రతువుతో రథయాత్ర ప్రారంభమైంది. అయితే, ఊరేగింపు పూర్తికావడానికి మాత్రం రెండు గంటలకు పైగా ఆలస్యమైంది.








