దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఢిల్లీలో జనసేన పార్టీ నిర్వహించిన ‘సేన ప్రస్థానం-జాతీయ సమైక్యత కోసం’ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిన్న చిన్న శక్తులను తక్కువ అంచనా వేయకూడదని, అవి బలమైన ప్రభావాన్ని చూపగలవని సుమతీ శతకాన్ని ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు.
దేశంలో అవినీతి, నిరుద్యోగం, విద్యావ్యవస్థలోని లోపాలను నిరసిస్తూ యువత సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన ఉద్యమమే ‘కాక్రోచ్ జనతా పార్టీ’. ఈ పేరుతో పలుచోట్ల నిరసనలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “సుమతీ శతకంలో చెప్పినట్లు బలమైన సర్పం కూడా చలిచీమల చేతిలో చిక్కి చనిపోతుంది. ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చిన కాక్రోచ్ పార్టీని చూడగానే నాకు సుమతీ శతకం గుర్తొచ్చింది” అని అన్నారు.
దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తులు సిద్ధంగా ఉన్నాయని, అటువంటి విభజనవాద ఆలోచనల్లో చిక్కుకోకూడదనే ఉద్దేశంతోనే ఢిల్లీలో సమావేశమయ్యామని పవన్ తెలిపారు. కోట్ల మంది కలిస్తే మంచి లేదా చెడు ఏదైనా బలమైన ప్రభావాన్ని చూపించగలరని పేర్కొన్నారు. విభజనవాదాన్ని సృష్టిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో మనం అందులో భాగస్వాములం కాకుండా, ఐక్యంగా ఎదురొడ్డి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.








