పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పూర్తిగా తిరస్కరించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనని, తాము ఓడిపోలేదని అన్నారు. ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఇది “ప్రజాస్వామ్య హత్య” అని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. తాము ఈ ఫలితాలను చట్టబద్ధమైన ఓటమిగా అంగీకరించబోమని స్పష్టం చేశారు.
కోల్కతాలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ దాదాపు 100 స్థానాలను అక్రమంగా దొంగిలించిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్, కేంద్ర బలగాలు పక్షపాతంగా వ్యవహరించాయని, దాదాపు 90 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి కుట్రపూరితంగా తొలగించారని విమర్శించారు.
తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్లోనూ ఓటమి పాలైనప్పటికీ, తాను రాజీనామా చేయబోనని మమత స్పష్టం చేశారు. తన రాజకీయ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై నిజ నిర్ధారణకు 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రానికి వెళ్తున్న సమయంలో తన కారును అడ్డుకుని, తనపై భౌతిక దాడికి యత్నించారని ఆమె ఆరోపించారు. సీఆర్పీఎఫ్ బలగాలు గూండాల్లా వ్యవహరించాయని మండిపడ్డారు.
ఈ క్లిష్ట సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వంటి ‘ఇండియా’ కూటమి నేతలు తనకు ఫోన్ చేసి మద్దతు తెలిపారని మమత వెల్లడించారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ 207 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకోగా, టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాల రోజును బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక ‘చీకటి రోజు’గా ఆమె అభివర్ణించారు.








