దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో గెలుపోటములు తేలిపోయాయి. అయితే, కేవలం గెలిచిన సీట్ల సంఖ్యే కాకుండా, పార్టీలకు లభించిన ఓట్ల శాతం కూడా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాలను, ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఈ ఓట్ల శాతం విశ్లేషణ పార్టీల నిజమైన బలాబలాలను, భవిష్యత్ రాజకీయాలను సూచిస్తోంది.
బెంగాల్, అసోంలో బీజేపీ ప్రభంజనం
పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ గెలుపు వెనుక బీజేపీకి లభించిన ఓట్ల శాతం కీలక పాత్ర పోషించింది. బీజేపీ ఏకంగా 45.84 శాతం ఓట్లను కైవసం చేసుకోగా, అధికార టీఎంసీ 40.80 శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. ఈ గణనీయమైన ఓట్ల వ్యత్యాసమే బీజేపీకి స్పష్టమైన మెజారిటీని అందించింది. ఇక అసోంలో కూడా బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, 37.81 శాతం ఓట్ల శాతాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీ 29.84 శాతం ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.
తమిళనాట విజయ్ సంచలనం
తమిళనాడు రాజకీయాల్లో ఈ ఎన్నికలు ఒక పెను సంచలనాన్ని సృష్టించాయి. సినీ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ తన తొలి ఎన్నికలతోనే రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసింది. ఏకంగా 34.92 శాతం ఓట్ల శాతంతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న ద్రావిడ పార్టీలైన డీఎంకే 24.19 శాతం, అన్నాడీఎంకే 21.21 శాతం ఓట్ల శాతాన్ని సాధించాయి. టీవీకే రాకతో తమిళ రాజకీయాలు ముక్కోణపు పోటీగా మారాయని ఈ ఓట్ల శాతం స్పష్టం చేస్తోంది.








