AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డబ్బుతో కొనేశారు… ఎగ్జిట్ పోల్స్ పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. అవన్నీ బూటకమని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ (బీజేపీ) డబ్బులు ఇచ్చి, ఒత్తిడి చేసి మీడియా సంస్థల ద్వారా వాటిని ప్రసారం చేయించిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు గురువారం తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.

 

స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోకుండా నిరోధించడం, మే 4న జరిగే ఓట్ల లెక్కింపునకు ముందే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ఉద్దేశమని మమత వివరించారు. “నిజానికి తృణమూల్ 226 నుంచి 230కి పైగా స్థానాలు గెలుస్తుందని బీజేపీకి అర్థమైంది. అందుకే మీడియాను అడ్డం పెట్టుకుని ఈ పని చేశారు. బుధవారం మధ్యాహ్నం 1:08 గంటలకు ఎగ్జిట్ పోల్ అంచనాలను మీడియా సంస్థలకు పంపినట్లు నా వద్ద కచ్చితమైన సమాచారం ఉంది” అని ఆమె అన్నారు.

 

కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు కలిసి ప్రజలపై, తమ కార్యకర్తలపై అఘాయిత్యాలకు పాల్పడినప్పటికీ, ఎండను సైతం లెక్కచేయకుండా ఓటు వేసిన సామాన్య ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “బెంగాల్‌ను కైవసం చేసుకోవాలనుకున్న వారి భవిష్యత్తు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఎన్నో అణచివేతలను ఎదుర్కొని పోరాడిన నా పార్టీ కార్యకర్తలకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా” అని మమత పేర్కొన్నారు.

 

ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే వరకు ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా కాపలా కాయాలని ఆమె పార్టీ కార్యకర్తలకు, కౌంటింగ్ ఏజెంట్లకు పిలుపునిచ్చారు. తాను కూడా వ్యక్తిగతంగా వీధుల్లోకి వచ్చి స్ట్రాంగ్ రూమ్‌లను కాపాడతానని, తనను చూసి కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయి, తాను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే వరకు ఏజెంట్లు టేబుళ్ల వద్ద నుంచి కదలవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే, నమ్మకమైన వారిని ప్రత్యామ్నాయంగా ఉంచి వెళ్లాలని ఆదేశించారు.

ANN TOP 10