ఢిల్లీ హైకోర్టులో అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. చీఫ్ జస్టిస్ కోర్టు గదిలో వర్చువల్ విచారణ జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు అశ్లీల వీడియోలను ప్లే చేయడంతో తీవ్ర కలకలం రేగింది. వీడియో కాన్ఫరెన్స్ (VC) ద్వారా విచారణ నిర్వహిస్తున్న సమయంలో ఈ అంతరాయం ఏర్పడింది. ఒకటి కాదు రెండుసార్లు పదే పదే అశ్లీల కంటెంట్ ప్రదర్శితం కావడంతో న్యాయమూర్తులు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వికృత చేష్టల వల్ల విచారణను రెండుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. మొదటిసారి అభ్యంతరకర వీడియోలు కనిపించినప్పుడు అధికారులు వెంటనే వ్యవస్థను నిలిపివేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత మళ్లీ విచారణను ప్రారంభించగా రెండోసారి కూడా అదే విధంగా అశ్లీల దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అధికారులు వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ను పూర్తిగా మూసివేశారు. రెండో అంతరాయం తర్వాత వర్చువల్ కోర్టు సెషన్ మళ్లీ ప్రారంభం కాలేదు.
ఆ వీడియోలు ప్లే అవుతున్న సమయంలో స్క్రీన్పై మీరు హ్యాక్ చేయబడ్డారు (You’ve been hacked) అనే సందేశం కనిపించినట్లు సమాచారం. దీనికి తోడు ఒక ఆటోమేటెడ్ వాయిస్ కూడా ఇదే విషయాన్ని పదే పదే అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ ఇంటర్ఫేస్పై సైబర్ దాడి జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీధర్ సర్నోబత్, షిత్జీత్ సింగ్ పేరుతో ఉన్న అకౌంట్ల నుండి ఈ వీడియోలు ప్లే అయినట్లు గుర్తించారు.
లైవ్ లా (LiveLaw) కథనం ప్రకారం వర్చువల్ విచారణలోకి లాగిన్ అయిన ఒక గుర్తు తెలియని యూజర్ తన స్క్రీన్ను షేర్ చేసి ఈ అశ్లీల కంటెంట్ను ప్లే చేశాడు. ఆన్లైన్ విచారణల భద్రత యాక్సెస్ కంట్రోల్స్ పై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అనధికార వ్యక్తులు కోర్టు విచారణల్లోకి చొరబడి వ్యవస్థను దుర్వినియోగం చేయడంపై న్యాయ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.








