AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాళేశ్వరం కేసు.. కేసీఆర్, హరీశ్‌ రావులకు హైకోర్టులో భారీ ఊరట..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్ రావుతో పాటు మరో ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ కమిషన్ చట్టం కింద నిర్దేశించిన సరైన ప్రక్రియను ఘోష్ కమిషన్ పాటించలేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

 

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీశ్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ సీఎస్ ఎస్.కె. జోషి, ప్రస్తుత ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ కమిషన్ చట్టంలోని సెక్షన్ 8బీ, 8సీ కింద తమకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయలేదని, తమ వాదనలు వినకుండానే కమిషన్ నివేదిక రూపొందించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేస్తూనే, ప్రస్తుత నివేదిక ఆధారంగా పిటిషనర్లపై చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్ప‌ష్టం చేసింది.

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016లో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన నివేదికను 2025 జులై 31న ప్రభుత్వానికి సమర్పించింది. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు కేసీఆర్, హరీశ్ రావు సహా అధికారులను బాధ్యులను చేస్తూ నివేదికలో పేర్కొంది.

 

పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి, కమిషన్ తరఫున సీనియర్ కౌన్సిల్ ఎస్. నిరంజన్ రెడ్డి వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా నలుగురు పిటిషనర్లపై ఎలాంటి బలవంతపు చర్యలు ప్రారంభించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ANN TOP 10