తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. టీవీకే (TVK) అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేయడం. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి దశలోనే ఆయనకు చట్టపరమైన ఇబ్బందులు ఎదురుకావడం సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆస్తుల వివరాల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయన్నది ప్రధాన అభియోగం. ఈ వ్యత్యాసాలపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా, దీనిని క్లరికల్ పొరపాటుగా భావించలేమని స్పష్టం చేసింది.
అసలు విషయం ఏమిటంటే.. విజయ్ రెండు వేర్వేరు నియోజకవర్గాల (పెరంబూర్, తిరుచ్చి తూర్పు) నుంచి దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆస్తుల విలువలు పొంతన లేకుండా ఉన్నాయి. ఒకచోట తన ఆస్తుల విలువ రూ.115 కోట్లుగా పేర్కొంటే, మరోచోట రూ.220 కోట్లుగా చూపించారు. అంటే దాదాపు రూ.100 కోట్లకు పైగా ఆస్తులను ఆయన దాచారనేది పిటిషనర్ విఘ్నేష్ వాదన. ఈ లెక్కల తేడాల వెనుక ఉద్దేశపూర్వక అక్రమాలు ఉన్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ధర్మాసనం, కేవలం విజయ్కు మాత్రమే కాకుండా అటు ఆదాయపు పన్ను శాఖకు, ఇటు ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు పంపింది. ఎన్నికలకు ముందే దీనిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సామాన్య ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన నేతలు ఇలాంటి పొరపాట్లు చేయడం ఆమోదయోగ్యం కాదని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఎన్నికల వేళ ఈ ఆస్తుల గొడవ విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠగా మారింది.








