AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళా బిల్లు ఫెయిల్ అయితే సంబరాలా .? కాంగ్రెస్, ఇండియా కూటమిపై బండి సంజయ్ ఫైర్..!

కరీంనగర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక పర్యటన చేశారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు.

 

మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని ప్రస్తావిస్తూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా అడ్డుకోవడం మూర్ఖత్వమని, ఆ బిల్లు ఆగిపోయినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధి లేదని, కేవలం సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలకు పదవులు దక్కితేనే మహిళలందరికీ న్యాయం జరిగినట్లు ఆ పార్టీ భావిస్తోందని ఎద్దేవా చేశారు.

 

రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డికి తెలంగాణ అభివృద్ధి కంటే ఢిల్లీ పీఠంపైనే కన్నుందని ఆరోపించారు. అవకాశం దొరికితే రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చోవాలనేది రేవంత్ రెడ్డి అసలు ప్లాన్ అని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలే మహిళా రిజర్వేషన్లకు ప్రధాన శత్రువులని, ఇండియా కూటమి కుట్ర పూరితంగా మొదటి నుండి ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని విమర్శించారు.

 

డిలిమిటేషన్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని మహిళా బిల్లును అడ్డుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని, దీని వల్ల దక్షిణ భారత్ కు అన్యాయం జరుగుతుందనే వాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లు వీగిపోవడానికి స్టాలిన్, రేవంత్ రెడ్డిలే ప్రధాన కారణమని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలోని కొత్త తరం నాయకులే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీరును అసహ్యించుకుంటున్నారని, మహిళలు ఈ కూటమిని ఎన్నటికీ క్షమించరని ఆయన స్పష్టం చేశారు.

ANN TOP 10