AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం: ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే ఉద్యమ బాట.. ఏప్రిల్ 1 నుంచి ఆందోళనలు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. వేతన సవరణ సంఘం (PRC) ఏర్పాటు, మధ్యంతర భృతి (IR), పెండింగ్‌లో ఉన్న డీఏల (DA) విడుదల మరియు బకాయి బిల్లుల చెల్లింపు కోసం ఉగాది నాటికి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలో జరిగిన భేటీలో జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఈ మేరకు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వమైనా వచ్చిన రెండు నెలల్లోనే ఐఆర్ ప్రకటించేదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ మరింత దూరమవుతుందనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొందని వారు పేర్కొన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన రూ. 10 వేల కోట్ల బకాయిలు, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు సంబంధించిన రూ. 30 వేల కోట్ల పెండింగ్ నిధులపై ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని విమర్శించారు.

ఉగాదిలోపు ప్రభుత్వం స్పందించని పక్షంలో ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్త నిరసనలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. తొలుత అనంతపురం జిల్లాలో ప్రారంభించి, అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని, ఆపై విజయవాడలో భారీ ‘మహా ధర్నా’ చేపడతామని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని, ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పోరాటం తప్పదని వారు తేల్చిచెప్పారు.

ANN TOP 10