నెల్లూరు జిల్లావ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల కోసం పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని మొత్తం 176 పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పరీక్షా పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర నిఘాతో పాటు, ప్రశ్నపత్రాలు మరియు సమాధాన పత్రాల తరలింపు సమయంలోనూ ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.
పరీక్షలు జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని ఎస్పీ ఆదేశించారు. ఇన్విజిలేటర్లు మరియు కేటాయించిన సిబ్బంది మినహా ఇతరులెవరూ పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఉండకూడదని నిబంధన విధించారు. ఎగ్జామ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవకతవకలు జరగకుండా మొబైల్ పెట్రోలింగ్ బృందాలు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, ఇతర శాఖల సమన్వయంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎస్పీ ఆల్ ది బెస్ట్ చెబుతూనే, పరీక్షా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ఘటన చోటుచేసుకుంటే వెంటనే డయల్ 100/112 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9392903143 కు సమాచారం అందించాలని ఆమె జిల్లా ప్రజలకు మరియు విద్యార్థులకు సూచించారు.








