కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు చేస్తున్న ఆందోళనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. వారి ఆందోళన నేపథ్యంలో ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే స్వయంగా ఉప్పాడకు చేరుకుని మత్స్యకారులతో సమస్యలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ హామీతో గత రెండు రోజులుగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళన విరమించారు. సముద్రంలో కలుస్తున్న ఫార్మా వ్యర్థాల కారణంగా మత్స్య సంపద దెబ్బతింటోందని ఆందోళన చేస్తున్న మత్స్యకారులు, కాలుష్య కారక పరిశ్రమలను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారని, సమస్యల పరిష్కారానికి ఆయా సంఘాల నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ మత్స్యకారులకు తెలియజేశారు.
దీంతో మత్స్యకార సంఘాల నాయకులు చర్చించుకుని ధర్నాను విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అక్టోబర్ 10వ తేదీ లోగా తమ డిమాండ్లపై చర్యలు తీసుకోకపోతే, మరోసారి ధర్నాకు దిగుతామని వారు తెలిపారు.