AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీమిండియాలో గంభీర్ మార్క్..

భారత క్రికెట్ జట్టులో కొత్త హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సహాయక సిబ్బందిలో మార్పుల పర్వం కొనసాగుతోంది. తాజాగా, దశాబ్ద కాలంగా జట్టుతో పనిచేస్తున్న మసాజర్ రాజీవ్ కుమార్‌ను బీసీసీఐ తప్పించింది. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటన వరకు జట్టుతో ఉన్న ఆయన కాంట్రాక్టును పునరుద్ధరించకూడదని బోర్డు నిర్ణయించింది.

 

ఇటీవలే బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌లను తొలగించిన బీసీసీఐ, ఇప్పుడు రాజీవ్‌ కుమార్‌కు కూడా ఉద్వాసన పలికింది. గంభీర్ రాకకు ముందు పనిచేసిన సిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

 

టీమిండియా మేనేజ్‌మెంట్‌లోని ఒక కీలక వ్యక్తి అభిప్రాయం ప్రకారం, సహాయక సిబ్బంది ఎక్కువ కాలం జట్టుతో కొనసాగితే ఆటగాళ్లతో ఒక రకమైన సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది జట్టు ఎదుగుదలకు ఆటంకంగా మారుతుందని, ఫలితాలు కూడా తగ్గుముఖం పడతాయని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఆలోచనా విధానంతోనే పాత సిబ్బందిని క్రమంగా తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

 

గతంలో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌ను కూడా తొలగించినప్పటికీ, ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఆయన్ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అయితే, రాబోయే ఆసియా కప్‌లో ఆయన కొనసాగుతారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తానికి, గంభీర్ ఆధ్వర్యంలో టీమిండియా సహాయక బృందం సరికొత్త రూపు సంతరించుకుంటోంది.

ANN TOP 10