తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. కొత్తగా ముగ్గురు సభ్యులకు కేబినెట్లో స్థానం కల్పించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:20 గంటల మధ్య కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ విస్తరణలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ, ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గంలోకి కొత్తగా రానున్న వారిలో బీసీ వర్గం నుంచి వి.శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ (మాల) వర్గం నుంచి వివేక్, ఎస్సీ (మాదిగ) వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్కుమార్లకు అవకాశం దక్కనున్నట్లు సమాచారం. దీంతో పాటు శాసనసభ ఉప సభాపతి (డిప్యూటీ స్పీకర్) పదవికి రామచంద్రునాయక్ను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లతో కాంగ్రెస్ అధిష్ఠానం జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం నిన్న తన తుది నిర్ణయాన్ని వెల్లడించినట్లు సమాచారం. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోని పలువురు ముఖ్య నేతలతో చర్చించి, విస్తరణకు సంబంధించిన ఏర్పాట్లను ఖరారు చేశారు.
మొదట మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ, ప్రస్తుతానికి ఎస్సీ, బీసీ వర్గాలకే అవకాశం కల్పించాలని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే, మాదిగ సామాజికవర్గంతో పాటు ఎస్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్రెడ్డికి కూడా చోటు కల్పించాలని ముఖ్యమంత్రి గట్టిగా పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, ఆయన సోదరుడు, ప్రస్తుత మంత్రి వెంకట్రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమవుతుందని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని అధిష్ఠానం తేల్చిచెప్పడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయి. వీటితో పాటు చీఫ్ విప్ పదవి భర్తీకి కూడా కసరత్తు జరుగుతోంది. బీసీ వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ ప్రస్తుతం శాసనసభలో విప్గా కొనసాగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో వికారాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత సభాపతి ప్రసాద్కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకుని, అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవి ఇచ్చే అంశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవుల కోసం గట్టిగా పోటీపడుతున్న వారిలో ఒకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చి సర్దుబాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
గత నాలుగు రోజులుగా హైదరాబాద్లోనే ఉన్న మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ విస్తరణ ఉండాలని ఆమె అధిష్ఠానానికి సూచించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, భవిష్యత్తులో వారికి పదవుల్లో ప్రాధాన్యత ఉండదని అధిష్ఠానం స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా, ఎస్సీ వర్గీకరణ అమలుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టినందున, దాని ప్రకారం మంత్రివర్గంలో తమ వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. సీఎంను కలిసిన వారిలో అడ్లూరి లక్ష్మణ్కుమార్, వేముల వీరేశం, సామేల్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ వర్గానికి తగినన్ని అవకాశాలు రాలేదని, ఈసారైనా మంత్రివర్గంలో తమకు తప్పనిసరిగా చోటు కల్పించాలని వారు ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం.
