ఎనిమిదేళ్లుగా ఎలాంటి పదవి లేదు..
(అమ్మన్యూస్, హైదరాబాద్):
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన కే.కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తనకు అవకాశం ఇవ్వాలని గడిచిన ఎనిమిది ఏళ్లుగా ఎలాంటి పదవి లేదని వాపోయారు. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ టికెట్ తనకు వస్తే గెలిచేవాడిని అని అన్నారు. టికెట్ విషయంలోనూ తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై అధ్యయనం కోసం ఏఐసీసీ ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ తెలంగాణకు వస్తున్నదని ఈ కమిటీ ముందుగా సునీల్ కనుగోలును కలవాలని వీహెచ్ కోరారు. కాగా కేకే రాజీనామాతో ఏర్పడిన రాజ్యసభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ స్థానానికి సీనియర్ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు అభిషేక్ మను సింఘ్విని నిలబెట్టాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్యా బలం రీత్యా ఈ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో ఈ ఛాన్స్ ఇవ్వాలని వీహెచ్ కోరడం హాట్ టాపిక్ గా మారింది.
సిరాజ్ ప్రతిభను ఆనాడే గుర్తించా..
టీ–20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన టీమ్ మెంబర్ మహ్మద్ సిరాజ్ మన హైదరాబాదీనే అని అతడికి సీఎం ఉద్యోగం, ప్లాట్ ఇవ్వాలని నిర్ణయించడంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో సిరాజ్ ప్రతిభను చూసి సీఎఫ్ఎ చైర్మన్ గా నేను సన్మానించానన్నారు.