AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాలుగు గోడల మధ్య నిర్ణయాలు ఉండవు.. రైతుల సంక్షేమానికే రైతు భరోసా..

విధివిధానాలు రూపొందించేందుకే అభిప్రాయ సేకరణ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రతీ పైసా ప్రజలదే.. మళ్లీ వారికే చెందాలి: పొంగులేటి

(అమ్మన్యూస్, ఖమ్మం ):
రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని, నాలుగు గోడల మధ్య నిర్ణయాలు ఉండవని, రైతు సంక్షేమానికే అధిక ప్రాధాన్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా అమలుపై తెలంగాణ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా అనేక మంది నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. అందులో భాగంగా బుధవారం ఖమ్మం జిల్లాలో మంత్రుల బృందం పర్యటించింది. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావు ఉన్నారు. ఈ జిల్లాల పర్యటన ముగిసిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగానే జూలై 10 ఖమ్మం, 11న అదిలాబాద్, 12న మహబూబ్‌ నగర్, 15న వరంగల్, 16న సంగారెడ్డి(మెదక్‌), 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి కలెక్టర్‌ కార్యాలయాల్లో రైతుల నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు.

రైతు భరోసాపై వర్క్‌షాప్‌..
ఇవాళ ఖమ్మంజిల్లా కలెక్టరేట్‌లో రైతు భరోసాపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతుభరోసాపై విధివిధానాల ఖరారు కోసం రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అన్నిజిల్లాలో అభిప్రాయాలు సేకరించి, త్వరలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కూడా స్పందించారు.

గత ప్రభుత్వం ఏ స్కీమ్‌ చేపట్టినా ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకుని ప్రజలపై రుద్దారన్నారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతీపైసా ప్రజల నుంచి వచ్చిందేనని, రైతులు ఇచ్చే సూచనలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతుల ఆలోచన మేరకే ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుల అభిప్రాయం తీసుకున్నాకే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ANN TOP 10