రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే వారధి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి. NH65గా పిలవబడే ఈ రహదారి దేశంలోని అత్యంత వాహనాల రద్దీ కలిగి ఉంది. ఈ హైవేపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నడుం బిగించింది. తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని సంకల్పించింది.
రూ. 326 కోట్ల వ్యయంతో బ్లాక్ స్పాట్స్ వద్ద దిద్దుబాటు చర్యలు..
ఈ హైవేపై ఉన్న బ్లాక్ స్పాట్స్ మరమ్మతులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమీక్షించారు. 17 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో పనులకు రూ.326 కోట్ల వ్యయంతో ప్రాథమిక దిద్దుబాటు చర్యలను చేపట్టారు. బ్లాక్ స్పాట్స్ వద్ద సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, జంక్షన్ డెవలప్ మెంట్స్, VUP (వెహికిల్ అండర్ పాస్) లు, రెండు వైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో ప్రమాదాలను అరికడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. చిట్యాల వద్ద రూ.40 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఫ్లై ఓవర్కు ఆయన శంకుస్థాపన చేశారు. చౌటుప్పల్లో రూ. 140 కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు.









