ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిపై గుడివాడలో పోలీస్ కేస్ నమోదైంది. వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు గుడివాడ పోలీసులు తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వార్డు వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని పోలీసులకు వివరించి, రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, వైసీపీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీనులతో పాటు మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
