ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించింది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వంగా గీతపై దాదాపు 70 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో జనసేనాని గెలుపుపై సినీ పరిశ్రమలోని నటీనటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటు తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు పవన్ కల్యాణ్ ఇంటికి చేరుకోగా.. పలువురు సినీ సెలబ్రెటీలు ఆయనకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఇక పవన్ గెలుపుపై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. “ఆద్య, అకీరాలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను” అంటూ ఇంట్లో ఆధ్య సంతోషంగా ఉన్న క్షణాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ పోస్టుపై నెటిజన్లతో పాటు పవన్ అభిమానులు స్పందిస్తున్నారు. పవన్ గెలుపును జనసైనికులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.









