హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లు అనిపిస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. రాష్ట్రంలో గత దశాబ్దం ఒక విషాదంగా మిగిలిపోయిందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(పీజేటీఎస్ఏయూ) తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం(టాసా), వర్సిటీ బోధనేతర సిబ్బంది సంఘం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హరగోపాల్ మాట్లాడారు.
ఈ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ కార్యదర్శులకు విశ్వవిద్యాలయాల బాధ్యతలను అప్పగిస్తే వారేం చేయగలుగుతారని ప్రశ్నించారు. వ్యవసాయ పరంగా తెలంగాణ అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నా గత ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయలేదని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. తెలంగాణకు విత్తన భాండాగారం అనే పేరున్నప్పటికీ సన్న, చిన్న కారు రైతులకు మేలు చేసేలా గత ప్రభుత్వం చర్యలు చేపట్టలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చర్యలు, సంప్రదింపులకు తలుపులు తెరవడం హర్షణీయమని అన్నారు.









