తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్సైజ్ , పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరుగని పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈ సందర్భంగా వారు చేసిన సేవలను మంత్రి గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాల్ని స్మరించుకునే ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే అమరులకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు, సకల జనులకు, ప్రత్యేక రాష్ట్ర అకాంక్షను గౌరవించి మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ, తెలంగాణ కలను సాకారం చేసిన సోనియా గాంధీ కి ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ (Congress)కు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ద్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తోందని అన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల ఆశయ సాధనకు’ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందుతున్నదని వివరించారు.
యావత్ తెలంగాణ సమాజం మనోభావాలకు అనుగుణంగా, ప్రజా సంఘాలు, పౌర సంస్థలు, ఉద్యోగ సంఘాలతో సంప్రదిస్తూ… వారి అభిప్రాయాలను గౌరవిస్తూ… ప్రజాస్వామిక పాలనను అందిస్తూ… కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.









