AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం జగన్.. క్యాడర్‏లో జోష్..

సిద్ధం.. మేమంతా సిద్ధం బస్సుయాత్రల తర్వాత మలివిడత ప్రచారం మొదలుపెట్టిన సీఎం జగన్‌.. సోమవారం మూడు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా అనకాపల్లిజిల్లా చోడవరం నియోజకవర్గంలోని కొత్తూరు జంక్షన్‌ దగ్గర జరిగిన సభలో పాల్గొన్న జగన్‌.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రజలు చంద్రబాబును నమ్మడం అంటే.. కొండచిలువ నోట్లో తలపెట్టడమేనన్నారు.

చంద్రబాబును నమ్మితే అంతా గోవిందా.. గోవిందా అంటూ జనంలో జోష్‌ పెంచారు సీఎం జగన్‌. రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని, వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని.. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మాత్రం పథకాలకు ముగింపేనన్నారు.

కోనసీమజిల్లా అంబాజీపేటలో జరిగిన బహిరంగ సభలో కూటమి కుట్రలపై ధ్వజమెత్తారు సీఎం జగన్‌. జగన్‌ ఒక్కడిని ఓడించడానికి కూటమి పేరుతో చంద్రబాబు మళ్లీ కుట్రలు చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో హీరో ఎవరో.. విలన్‌ ఎవరో గుర్తించి ప్రజలు ఓటు వేయాలని కోరారు జగన్‌.

ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభంజనం తప్పదన్నారు సీఎం జగన్‌. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని.. ఎక్కడా తగ్గేదేలే అన్నారాయన. గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన సభలోనూ కూటమిని కౌరవసైన్యంతో పోల్చుతూ ఫైరయ్యారు జగన్‌. రెండు వారాల్లో కురుక్షేత్ర యద్ధం జరగబోతోందన్నారు.

58 నెలలు ఈ బచ్చా చేసిన పనులను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు జగన్‌. కూటమి పేరుతో వస్తున్న చంద్రబాబుది అందరినీ మోసం చేసిన చరిత్ర అన్నారు జగన్‌. కూటమిపై తాను ఒక్కడినే యుద్ధం చేస్తున్నానని తెలిపారు. మంచి చేసేది ఎవరో.. చెడు చేసేదెవరో గుర్తించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. మూడు ప్రాంతాల్లోనూ జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ANN TOP 10