ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొత్త ట్విస్టు
(అమ్మన్యూస్ ప్రతినిధి, హైదరాబాద్):
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గంట గంటకు కొత్త ట్విస్టులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఈ కేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అఫిడవిట్ లో ప్రస్తావించింది. కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ లభించిందని, రెండు సార్లు పిలిచినా శరణ్ విచారణకు రాలేదని కోర్టుకు ఈడీ తెలియజేసింది.
సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ దే కీలక పాత్ర ఉన్నదని మేక శరణ్ కవితకు అత్యంత సన్నిహితుడని, కవిత అరెస్ట్ సమయంలో శరణ్ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్ లో పేర్కొంది. అరెస్ట్ సమయంలో శరణ్ ఫోన్ ను సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లాబీకి సంబంధించిన లావాదేవీల సమాచారం గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఈడీ అతడిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఓ వైపు కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో మరోవైపు శరణ్ నివాసంలో ఈడీ రెయిడ్స్ నిర్వహించింది. ప్రస్తుతం మేక శరణ్ అందుబాటులో లేరని తెలుస్తోంది.