AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌ మేనిఫెస్టో ‘పాంచ్‌ న్యాయ్‌’.. సీడబ్ల్యూసీ గ్రీన్‌ సిగ్నల్‌

(అమ్మన్యూస్‌ ప్రతినిధి, హైదరాబాద్‌):
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. ఓ వైపు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోన్న ఏఐసీసీ.. మరోవైపు ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టో రెడీ చేయడంపై ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా ‘పాంచ్‌ న్యాయ్‌’ పేరుతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో రెడీ చేసింది. 5 ప్రధాన అంశాలతో పాంచ్‌ న్యాయ్‌ మేనిఫెస్టోను రూపొందించారు.

కాగా, పాంచ్‌ న్యాయ్‌ మేనిఫెస్టోకు మంగళవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఢల్లీిలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయిన సీడబ్ల్యూసీ పాంచ్‌ న్యాయ్‌ మేనిఫెస్టోపై చర్చించిన అనంతరం ఆమోదం తెలిపింది. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఆమోదం తర్వాత అధికారికంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. పాంచ్‌ న్యాయ్‌ మేనిఫెస్టోలో హిస్సేదారి న్యాయ్‌, కిసాన్‌ న్యాయ్‌, శ్రామిక్‌ న్యాయ్‌, యువ న్యాయ్‌, నారీ న్యాయ్‌ పేరిట కాంగ్రెస్‌ ఐదు ప్రధాన హామీలు ఇచ్చింది.

మరోవైపు ఇవాళ కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సైతం భేటీ అయ్యింది. ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి.. క్యాండిడేట్ల పేర్లను కన్ఫామ్‌ చేసినట్లు సమాచారం. ఇవాళ లేదా రేపు అధికారికంగా అభ్యర్థుల లిస్ట్ను ఏఐసీసీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల నేపథ్యంలో టికెట్‌ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌ తొలి జాబితాలో తెలంగాణలోని 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 13 పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది.

ANN TOP 10