హైదరాబాద్: మూడేళ్ల పాటు తెలంగాణ (Telangana)కు గవర్నర్గా వ్యవహరించిన తమిళిసై (Tamilisai) రాజీనామా చర్చనీయాంశంగా మారింది. అసలెందుకు ఆమె రాజీనామా చేశారు? గత సీఎం కేసీఆర్ (KCR)తో ఢీ అంటే ఢీ అన్న సమయంలో కూడా ఆమె రాజీనామా చేయాలని కూడా ఆమె చెప్పలేదు. అయితే ఇప్పుడెందుకు? అంటే దీనికి కారణం లేకపోలేదు. లోక్సభ (Loksabha) ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలోనే తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి రావాలనుకుంటున్నారట. తమిళనాడు (Tamilnadu) నుంచి ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నారని టాక్.
2019లో తెలంగాణ రాష్ట్రానికి తమిళిసై గవర్నర్గా వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ తమిళిసై కావడం విశేషం. మూడేళ్లకు పైగా తెలంగాణలో గవర్నర్ గా విధులు నిర్వర్తించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)తో నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరించారు. గవర్నర్గా ఉండి రాజ్భవన్(Rajbhavan) లో ప్రజాదర్బార్ నిర్వహించిన ఘనత కూడా తమిళిసైదే. రాజ్భవన్ ముందు ఫిర్యాదు బాక్స్ పెట్టిన తొలి గవర్నర్గా ప్రసిద్ధి చెందారు. గిరిజన విద్యార్థులకు అండగా నిలిచారు. తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారని సమాచారం. చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలో.. ఏదో ఒకచోట పోటీ చేసే యోచనలో ఉన్నారు. నాడార్ సామాజిక వర్గానికి చెందిన తమిళిసై తిరునల్వేలి, కన్యాకుమారి నుంచి పోటీ చేస్తారని కూడా టాక్ నడుస్తోంది.









