కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా చేశారు. గత నెల 28న ఆయన ఢిల్లీ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఆయన నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కోసం వస్తుందని ఆశిస్తున్నారు. అలాగే ఇటీవల ఆ సీటు కోసం మల్లు రవి కాంగ్రెస్ పార్టీ తరఫున దరఖాస్తు కూడా చేసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రత్యేక అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశామన్నారు. అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్నానని మల్లు రవి చెప్పారు. అయితే గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులను నియమించారు. ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ నియమితులయ్యారు. ఢల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు. ప్రొటోకాల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా హర్కర వేణుగోపాల్, పబ్లిక్ రిలేషన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ బాధ్యతలు అప్పగించారు.