కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. కార్ఖానాలోని లాస్య నందిత నివాసానికి చేరుకున్న ఆయన ఆమె భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం లాస్య నందిత మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే సాయన్న సతీమణిని, ఇతర కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు.
అంతకుముందు లాస్య నందిత మరణవార్త తెలియగానే కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా నందిత ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.