వన్డే సిరీస్లో దారుణంగా ఓడిన భారత జట్టు(Team India) టీ20 సిరీస్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ(64 నాటౌట్ : 53 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లు), స్మృతి మంధాన(54 : 52 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్) వీరబాదుడుతో కంగారూలను చిత్తు చేసింది. ఆసీస్ నిర్దేశించిన 141 పరుగుల లక్ష్యాన్ని 9వికెట్ల తేడాతో ఛేదించి ప్రతీకారం తీర్చుకుంది.
వన్డే సిరీస్లో విఫలమైన షఫాలీ, మంధాన డీవై పాటిల్ స్టేడియంలో ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేశారు. ఎడాపెడా ఫోర్లు, బౌండ్రీలతో కంగారూలను పరుగెత్తిస్తూ తొలి వికెట్కు 137 రన్జ్ జోడించారు. హాఫ్ సెంచరీ తర్వాత మంధాన ఔటైనా అప్పటికే టీమిండియా విజయం ఖరారైంది. 18వ ఓవర్లో జెమీమా రోడ్రిగ్స్ (6నాటౌట్) బౌండరీతో జట్టును గెలిపించింది. ఈ గెలుపుతో హర్మన్ప్రీత్ కౌర్ సేన మూడు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా తొలుత 141 పరుగులకు ఆలౌటయ్యింది. సాధు(Titas Sadhu) చెలరేగడంతో ఆసీస్ 4 ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 33 రన్స్కే 4 వికెట్లు పడడంతో ఆసీస్ స్కోర్ 100 దాటడమే కష్టమనిపించింది. కానీ, యువకెరటం ఫొబే లిచ్ఫీల్డ్(49), అలీసా పెర్రీ(37) దంచికొట్టారు. వీళ్లిద్దరూ ఐదో వికెట్కు 79 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆసీస్ టీమిండియాకు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది. సాధు విజృంభణతో బేత్ మూనీ(17), తహ్లియా మెక్గ్రాత్(0), అష్ గార్డ్నర్(0)లు పెవిలియన్ చేరారు.









