రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్రోడ్ సమీపంలో కొంగరకలాన్లో గురువారం నిర్వహించే బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ఉదయం శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్కు వెళ్తారు. అనంతరం చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత నేరుగా కొంగరకలాన్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరగనున్న పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అధ్యక్షత వహించనున్నారు.
అవినీతి అధికారులను విడిచిపెట్టొద్దు: సంజయ్
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారులను విడిచిపెట్టొద్దని.. వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిజాయతీతో పనిచేసే అధికారులను స్వేచ్ఛగా పని చేసుకోనివ్వాలని కాంగ్రెస్ సర్కారుకు సూచించారు. గత ప్రభుత్వం మాదిరిగా నిర్బంధాలు విధిస్తే కాంగ్రెస్ సర్కారుకూ ఇబ్బందులు తప్పవన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను నిర్వహించుకోలేని పరిస్థితి ఉండేదని విమర్శించారు. ప్రభుత్వం మారాక ఉద్యోగులకు స్వేచ్ఛ దొరికిందని, కేంద్ర కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారని చెప్పారు.