లోక్ సభకు పోటీచేయాలని కోరిన తెలంగాణ కాంగ్రెస్
పిఎసి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం
(అమ్మన్యూస్ ప్రతినిధి, హైదరాబాద్ )
ఇటీవల జరిగిన తెంగాణ ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తీర్మానం చేసింది. సోమవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ తీర్మానం చేశారు. మెదక్ ఎంపీగా సోనియాగాంధీని పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇందిరా గాంధీ సైతం మెదక్ నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ ఆలోచనను పార్టీ అధినాయకత్వానికి పంపనుంది. సోనియా పోటీ చేయడం ద్వారా రానున్న ఎంపీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించి తమ బలం చాటాలని భావిస్తోంది హస్తం పార్టీ. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కట్టడి చేసే వ్యూహంలో భాగంగా సోనియాను పోటీలోకి దించాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. సోనియా గాంధీ పోటీతో తెలంగాణలో ఏకపక్షంగా ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండీ రేవంత్ రెడ్డి తన పనితీరుతో అందరి మన్ననలు అందుకుంటుండగా, ఇటు రాజకీయంగా అటు పాలనాపరంగా తన ముద్ర వేస్తున్నారు.









