AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాలనపై తనదైన మార్క్ వేస్తున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపుతున్నారు. కీలక పోస్టింగ్‌ల్లోకి నిజాయతీ గల అధికారులను తీసుకుంటూ.. దుబారా ఖర్చుల జోలికి వెళ్లకుండా అందర్నీ ఆకట్టుకునేలా పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎం అయ్యాక కూడా సొంత కారునే వాడుతోన్న రేవంత్.. కొత్త కాన్వాయ్ కొనుగోలు పట్ల విముఖత వ్యక్తం చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ కారు కావాలని అధికారులు చెప్పడంతో ఆయన తన కారుకే బుల్లెట్ ప్రూఫ్ స్టిక్కరింగ్ చేయాలని చెప్పారు. కాన్వాయ్‌లోని కార్ల సంఖ్యను తగ్గించాలని కూడా ఆయన నిర్ణయించారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ భవన్ నుంచి భోజనం వచ్చింది. దీంతో రేవంత్ ఇంట్లోని వంట మనిషి ఆయనకు ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో ఇలాగైతే నిన్ను పనిలో నుంచి తీసేయాల్సి ఉంటుందని వంట మనిషికి రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. తాను తన సొంత భోజనమే తింటానని, ప్రోటోకాల్ లాంటివేమీ వద్దని.. ఎప్పటిలాగే వంట చేయమని వంట మనిషిని ఆదేశించారు.

ప్రగతి భవన్‌న ప్రజా భవన్‌గా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్కడి నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రగతి భవన్‌లో ఇంతకు ముందు సీఎం క్యాంప్ ఆఫీసు ఉండగా.. దాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు. దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్‌ను జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇందుకోసం భారీగా ఖర్చు చేయకుండా.. ఒక షెడ్డ్ లాంటి నిర్మాణాన్ని చేపట్టి దాన్ని క్యాంప్ ఆఫీసుగా ఉపయోగించుకోననున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి పాత సంప్రదాయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంలు, మంత్రులు అసెంబ్లీ సమావేశాల సమయంలో జర్నలిస్టులతో చిట్ చాట్ మాట్లాడేవారు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ చిట్ చాట్ మాట్లాడేందుకు ఇష్టపడలేదు. దీంతో తొమ్మిదిన్నర ఏళ్లపాటు జర్నలిస్టులతో సీఎం మాట్లాడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్లీ పాత విధానాన్ని ప్రారంభించారు. జర్నలిస్టులతో ఇష్టాగోష్టి మాట్లాడటంతోపాటు సందర్శకులను సైతం అనుమతిస్తున్నారు.

ANN TOP 10