AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

2 దశాబ్దాల తర్వాత ప్రతిపక్ష పాత్రలో కేసీఆర్

తెలంగాణలో ప్రస్తుత అసెంబ్లీ సెషన్ లో అవకాశం మిస్‌ అయినప్పటికీ.. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సెషన్ లో మాత్రం ఓ ఆసక్తికర సీన్ కనిపించనుంది. 40 ఏళ్ల రాజకీయ జీవితం.. ప్రాథమిక సహకార సంఘం నుంచి కేంద్ మంత్రి వరకు పదవులు.. ఉమ్మడి రాష్ట్రలో కీలక మంత్రి పదవులు.. సొంతంగా పార్టీ స్థాపన.. తీవ్ర స్థాయి ఉద్యమంతో తెలంగాణ రాష్ట్ర సాధన.. ఆపై ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్లు.. ఇదంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించేనని మీకు తెలుసు. మరిప్పుడు ఈయన విషయంలోనే ఓ ఆసక్తికర పరిణామం కనిపించనుంది.

కేసీఆర్ తాజా ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో బరిలో నిలిచిన ఆయన కామారెడ్డిలో ఓడిపోయారు. కాగా, బీఆర్ఎస్ కూడా ఇటీవలి ఎన్నికల్లో పరాజయం పాలవడంతో కేసీఆర్ ప్రతిపక్షంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయనను బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యేలు శనివారం ఎన్నుకున్నారు. 39 మంది ఎమ్మెల్యేల బలంతో కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కానున్నారు.

అప్పట్లో ప్రతిపక్షంలో.. 2000-01 మధ్యన టీడీపీకి రాజీనామా చేసిన కేసీఆర్.. సిద్దిపేట నుంచి గెలిచాక దాదాపు రెండున్నరేళ్లు ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నారు. అప్పట్లో ఆయన ఒక్కరే బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) ఎమ్మెల్యే కావడం గమనార్హం. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని గెలిచినా, ఆయన ఎంపీగానే కొనసాగారు. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాతనే కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అప్పటినుంచి మొన్నటి ఆదివారం వరకు కేసీఆర్ అధికార పక్షంలోనే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం ప్రతిపక్షంలో కూర్చోనున్నారు. అయితే, తుంటి ఎముక విరిగిన నేపథ్యంలో ఆయన ఆస్ప్రత్రి పాలయ్యారు. మరో 8 వారాల వరకు బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీన్నిబట్టి ఫిబ్రవరి రెండో వారం వరకు కేసీఆర్ విశ్రాంతి తీసుకోనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చే చాన్సుంది. అంటే.. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యే (ఈ సారి ప్రతిపక్ష నేత కూడా)గా కేసీఆర్ అసెంబ్లీలో కనిపించనున్నారు.

ANN TOP 10