తెలంగాణా రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ లో బండి సంజయ్ బీజేపీ అభ్యర్ధి పాయల శంకర్ కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ లో రోడ్ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే… హరీష్ రావు, కవితల పని ఔట్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు వ్యవసాయంపైనే దృష్టి పెట్టానని, ఇకపై ఉద్యోగాల సంగతి చూస్తానని, తెలంగాణలో ఇకపై ఇల్లులేని వారే ఉండబోరని కేసీఆర్ చెప్పడంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ”ఇన్నాళ్లు భూములమ్మి, ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడంపైనే దృష్టి పెట్టిన కేసీఆర్, ఇకపై ఉద్యోగుల సంగతి చూస్తాడట అంటూ ఎద్దేవా చేశారు ఇల్లు లేని వాళ్లే ఉండరంటే.. పేదలందరినీ తెలంగాణ నుండి పాకిస్తాన్ కు తరిమేస్తాడమో?’ అంటూ ఎద్దేవా చేశారు.
కేంద్రం పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లాకు నిధులిస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం వాటిని దారి మళ్లిస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది ప్రస్తుత ప్రభుత్వం అని మండిపడ్డారు. 50వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన చనాక కొరాట ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సాత్నాల ప్రాజెక్ట్పై చెక్ డ్యామ్లను నిర్మించడంలో కూడా విఫలమైందన్నారు. పోరాడేవాళ్లకు ఓట్లేసి గెలిపించకపోతే… భవిష్యత్తులో ఏ పార్టీ కూడా పేదల పక్షాన కొట్లాడే అవకాశమే లేదన్నారు. కులాల పేరుతో రాజకీయం చేసి ఓట్లు దండుకుని ఆ కులాలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దేనన్నారు. తెలంగాణలోని బీసీలన్నీ బీజేపీకే ఓటేయబోతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తే సీఎం కాబోతున్నారు. ఈ విషయం ఓటు చేసే సమయంలో ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. కేసీఆర్ మనిషైతే.. ఆయన నిజమైన హిందువైతే ఒవైసీకి బొట్టుపెట్టి హనుమాన్ చాలీసా చదివించాలని సవాల్ విసిరారు.









