AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీమిండియా మేము మీ వెంటే ఉన్నాం.. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమిపై ప్రధాని మోదీ

ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్ కప్‌ను ముద్దాడాలనే భారత్ ఆశలు అడియాసలు అయ్యాయి. కోట్లాదిమంది టీమిండియా అభిమానులకు బాధను మిగుల్చుతూ ఆస్ట్రేలియా ఏకంగా 6వసారి ప్రపంచ కప్‌ను కైవశం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 6 వికెట్ల తేడాతో కప్ గెలుచుకుంది. ఫైనల్లో భారత్ ఓటమిపాలైనప్పటికీ టోర్నీలో టీమిండియా ప్రదర్శన పట్ల అభిమానులు సానుకూలంగా స్పందించారు. ‘‘మేము మీ వెంటే ఉన్నాం..’’ అంటూ మద్ధతుగా నిలుస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా టీమిండియా ఓటమి అనంతరం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

‘‘ డియర్ టీమిండియా ఈ ప్రపంచ కప్‌లో మీ ప్రదర్శన, కప్ సాధించాలనే మీ సంకల్పం ఎంతో విశేషమైనవి. గొప్ప స్ఫూర్తితో మ్యాచ్‌లు ఆడారు. దేశానికి ఎనలేని గర్వాన్ని తెచ్చిపెట్టారు. మేము ఈ రోజు, ఎల్లప్పుడూ మీతో ఉంటాం’’ అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. మరోవైపు వరల్డ్ కప్ 2023 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్‌లో ప్రశంసనీయమైన ప్రదర్శన చేశారని, అద్భుతమైన విజయంతో ముగించారని మోదీ పేర్కొన్నారు. అద్భుతమైన సెంచరీ నమోదు చేసిన ట్రావిస్ హెడ్‌కు అభినందనలు తెలియజేశారు.

ANN TOP 10