– బీఆర్ఎస్ గూటికి తనయుడు
– మంత్రి హరీశ్ సమక్షంలో చేరిన ఉదయ్ బాబు మోహన్
– ఆయనతోపాటు మరికొందరు బీజేపీ నేతల చేరిక
– అందోల్లో రంజుగా రాజకీయాలు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్కు సన్ స్ట్రోక్.. ఇదేమిటీ చలికాలంలో సన్ స్ట్రోక్ ఏమిటా? అని ఆలోచిస్తున్నారా? అవునండీ మీరు విన్నది నిజమే.. ఇది తనయుడు ఇచ్చిన సన్(SON) స్ట్రోక్ .. తనయుడు ఉన్న పలంగా బీఆర్ఎస్లో చేరడంతో బిగ్ షాక్ కు గురయ్యారు. ఆయన కుమారుడు ఉదయ్ బాబు మోహన్ బీజేపీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం ఉదయం మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆందోల్ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. తాను పార్టీ మారే విషయం తన తండ్రికి తెలుసుకునని ఉదయ్ బాబు వెల్లడించారు. ఆందోల్ బీజేపీ కేడర్ మెుత్తం తన వెంటే ఉందని చెప్పారు. ఉదయ్ బాబు మోహన్ తో పాటు, ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకుర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు పార్టీలో చేరారు.
ఈఎన్నికల్లో్ల ఉదయ్ బాబు మోహన్ ఆందోల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆశించారు. ఈ మేరకు బీజేపీ తనకే టికెట్ కేటాయిస్తుందని ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఆయనకు టికెట్ నిరాకరించింది. తన తండ్రి, మాజీ మంత్రి బాబు మోహన్కే మరోసారి బీజేపీ అవకాశం ఇచ్చింది. తండ్రితో ఉన్న విభేదాలకు తోడు బీజేపీ టికెట్ కేటాయించకపోవటంతో ఉదయ్ బాబు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఆందోల్లో పార్టీ కేడర్ సపోర్ట్ చేయక సతమతమవుతోన్న బాబు మోహన్కు.. కొడుకు ఉదయ్ బాబు పార్టీ వీడటం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారింది. తండ్రి పోటీ చేస్తున్న స్థానంలో సపోర్ట్ చేయకుండా కొడుకు మరో పార్టీలో చేరటం ఆ పార్టీపై ప్రజల్లో నెగిటివ్ టాక్ వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.









