తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తాడో-పేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. కర్నాటక ఎన్నికలల్లో ఉపయోగించిన స్ట్రాటజీనే తెలంగాణలో అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే విజయభేరి యాత్రల పేరుతో సుడిగాలి ప్రచారం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన ప్రచారసభలో బీసీ డిక్లరేషన్(BC Declaration)ను ప్రకటించింది. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పెంచుతామని ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్తో పాటు బీసీ సబ్ ప్లాన్ను తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తెస్తామన్నారు. ఇంతే కాకుండా బీసీల అభివృద్దికి ఏటా 20వేల కోట్లు చొప్పున ఐధేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తామని వాగ్ధానం చేసింది కాంగ్రెస్. ప్రతీ జిల్లాకు బీసీ భవన్తో పాటు అర్హులైన బీసీలకు రుణాలివ్వడం , ప్రతీ మండలానికి బీసీ గురుకులం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు పెద్దపీట వేస్తూ ఎన్నికల ప్రచారంలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. చలో కామారెడ్డి పిలుపులో భాగంగా శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ విజయభేరి సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య సమక్షంలో బీసీ డిక్లరేషన్ ప్రకటన చేశారు. నామినేటన్ల చివరి రోజు కామారెడ్డిలో భారీ జనసందోహం మధ్య ఈప్రకటన చేసారు.
కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్లోని ముఖ్యమైన అంశాలు..
రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు పెంపు
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రిజర్వేషన్ల పెంపు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్
ప్రతి జిల్లా కేంద్రంలో 50కోట్లతో బీసీ భవన్
ప్రతి మండలానికి బీసీ గురుకులం ఏర్పాటు
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంపు
రిజర్వేషన్ల పెంపుతో కొత్తగా 23,973 మందికి పదవులు
బీసీలకు సబ్ప్లాన్.. తొలి అసెంబ్లీ సమావేశాల్లో తెస్తామని హామీ
బీసీల అభివృద్ధికి ఏటా 20వేల కోట్లు.. ఐదేళ్లలో లక్ష కోట్లు
అన్ని కులాల వారికి కార్పొరేషన్ల ఏర్పాటు
అర్హులైన బీసీలకు రూ.10లక్షల రుణ సాయం
ఇప్పటికే ఆరు పథకాలతో కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ..తెలంగాణలోనూ వాటిని అమలు చేస్తామని ప్రకటించింది. ముఖ్యంగా వాటిలో 1. మహాలక్ష్మి పథకం, 2.రైతు భరోసా పథకం, 3.గృహజ్యోతి పథకం, 4.మహాలక్ష్మి పథకం, 5.యువ వికాసం పథకం, 6.చేయూత పథకం పేరుతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు బీసీ డిక్లరేషన్ ప్రకటించి మైలేజ్ పొందాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ.









