AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు రిజర్వ్

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ పూర్తయ్యింది. మూడు రోజులుగా కొనసాగిన వాదనలు శుక్రవారంతో ముగిశాయి.. అయితే తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. సోమవారం తీర్పును వెల్లడిస్తామని తెలిపారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

బెయిల్‌ పిటిషన్‌పై గురువారమే చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు పూర్తి చేయగా.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మరికొన్ని వాదనలు వినిపిస్తానని కోర్టును కోరారు. దీంతో శుక్రవారం ఆయన మరికొన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. స్కిల్ స్కామ్ లో ఆడిటర్ వెంకటేశ్వర్లు ని విచారించాల్సి ఉందన్నారు సుధాకర్ రెడ్డి. ఈ నెల 10 న సీఐడీ విచారణకి రావాలని ఆడిటర్ వెంకటేశ్వర్లుకి నోటీసులిచ్చామని.. ఆడిటర్ వెంకటేశ్వర్లే స్కిల్ కార్పొరేషన్‌కి ఆడిటర్ గా పనిచేశారన్నారు. స్కిల్ కార్పొరేషన్ తో పాటూ టీడీపీకి కూడా వెంకటేశ్వర్లే ఆడిటర్ అన్నారు. టీడీపీకి, స్కిల్ కార్పొరేషన్‌కి ఒక్కరే ఆడిటర్ కావడంతో నిధులు దారి మళ్లింపు వ్యవహారం బయటపడకుండా మేనేజ్ చేశారని వాదించారు. చంద్రబాబుకి ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుందని.. చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారన్నారు. సీఎం హోదాని అడ్డు పెట్టుకుని డొల్ల కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాకి నిధులు మళ్లించారని.. జీవో నంబర్ 4 ని అడ్డం పెట్టుకుని నిధులు తీసుకున్నారన్నారు. చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దని కోరారు.

ఆ తర్వాత సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. స్కిల్ కుంభకోణం‌కేసు దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు ఏఏజీ సుధాకర్ రెడ్డి. చంద్రబాబు గత రెండు రోజుల‌కస్టడీలో సిఐడికి సహకరించలేదని.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే చంద్రబాబుని మరోసారి‌ ప్రశ్నించడానికి అవకాశమివ్వాలని కోరారు. చంద్రబాబుని కనీసం మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని.. చంద్రబాబుని విచారణ చేస్తేనే కొంతవరకైనా నిజం బయటకి వస్తుంది అన్నారు. చంద్రబాబు ఎన్నికల కమీషన్ కి సమర్పించిన ఐటి రిటర్స్‌ని మాత్రమే డౌన్ లోడ్ చేశామని.. బ్యాంకర్ల నుంచి ఎక్కడా తీసుకోలేదన్నారు. బ్యాంకర్ల నుంచి వివరాలు సేకరించామని చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలలో నిజం లేదన్నారు. చంద్రబాబు ఆదాయన పన్ను వివరాలు కూడా తీసుకుంటున్నామన్నారు.

కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవాల్సి ఉందని సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరారు.. ఇప్పటికే ఒకసారి చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇచ్చారని.. రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే వాదించారు. రూల్ 25కి క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్‌కు విరుద్దమని.. కేసు డైరీ లేకుండా జ్యుడిషియల్ రిమాండ్‌కు ఇవ్వకూడదన్నారు దూబే. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.

ANN TOP 10