హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు కు అరుదైన గుర్తింపు దక్కింది. ఇప్పటికే.. దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రయాణాలు సాగిస్తున్న ఎయిర్ పోర్టుగా శంషాబాద్ పేరు తెచ్చుకుంది. ఇన్ని రోజులు లక్షల మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో రద్దీగా మారి వార్తల్లో నిలిచిన శంషాబాద్ ఎయిర్ పోర్టు.. ఇప్పుడు అరుదైన గుర్తింపు తెచ్చుకుని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. కర్బన ఉద్గారాల నియంత్రణ, పర్యావరణ లక్ష్యాల సాధనలో శంషాబాద్ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు లభించింది. అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి ఈ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు లెవల్-4 గుర్తింపు ఇస్తూ.. సర్టిఫికేట్ కూడా ఇచ్చింది.
అయితే.. ఆసియా-పసిఫిక్ దేశాల్లో ఈ గుర్తింపు పొందిన ఎయిర్ పోర్టుల్లో శంషాబాద్ విమానాశ్రయంది ఆరో స్థానమని చెప్పుకొచ్చారు అధికారులు. ఎయిర్పోర్టు కార్బన్ అక్రిడిటేషన్లో అత్యధిక పాయింట్లు లభించాయని అధికారులు పేర్కొన్నారు. ఈ గుర్తింపు 2026 డిసెంబర్ 5 వరకు ఉండనుంది.
సౌర విద్యుత్తు వినియోగాన్ని వేగంగా పెంచుకుంటున్నామని ఎయిర్ పోర్ట్ సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు…. “జీరో వేస్ట్.. జీరో డిశ్ఛార్జ్” లక్ష్యంగా కొన్ని పనులను కూడా చేపట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగానే ఎయిర్ పోర్టులోని కార్యకలాపాలన్నింటినీ పునరుత్పాదకశక్తితో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.









