కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే జీపీఎస్ సాయం తీసుకోవడం సహజమే.. మనం వెళ్లాల్సిన దారిని జీపీఎస్ తప్పుగా చూపిస్తే ఇబ్బందులు తప్పవు. మరి ఆకాశంలో ఎగిరే విమానాలు దారి తప్పితే..? పూర్తిగా జీపీఎస్ పై ఆధారపడి దూసుకెళ్లే విమానానికి తప్పుడు సంకేతాలు అందితే.. అలా ఎలా జరుగుతుందని అనుకుంటున్నారా.? అలాగే జరిగింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 20 విమానాలు ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. అది కూడా ఇటీవల పదిహేను రోజుల వ్యవధిలోనే. దీంతో జీపీఎస్ తప్పుడు సంకేతాలకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇరాన్ గగనతలం పైనుంచి ఇటీవల ప్రయాణించిన 20 విమానాలు జీపీఎస్ స్పూఫింగ్ కు గురయ్యాయని అధికారులు గుర్తించారు. దీంతో తాము ఎక్కడ ఉన్నాము.. ఎటు వెళుతున్నామనే విషయం తెలియక గందరగోళానికి గురయ్యామని సదరు విమానాల పైలట్లు చెప్పారు. తమ లొకేషన్ వివరాల గురించి ఇరాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులను అడిగి తెలుసుకున్నామన్నారు. ఇరాన్ లో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని, జీపీఎస్ తప్పుడు సంకేతాలను చూపించిందని పైలట్లు గుర్తించారు. సాధారణ ప్యాసింజర్ విమానాలపై ఇలాంటి దాడి జరగడం అత్యంత అరుదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇరాన్ ఏటీసీ అధికారుల గైడెన్స్ తో ఈ విమానాలకు ముప్పు తప్పిందని సమాచారం. కేవలం 15 రోజుల వ్యవధిలో 20 విమానాలకు ఇలా జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.









