సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శ్రీరామునిగా భూమిపై వెలసిన దివ్య క్షేత్రం భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి సన్నిధానం. దక్షిణ అయోధ్యగా కీర్తింపబడుతున్న భద్రాద్రి ఆలయంలో విజయదశమి సందర్భంగా నిర్వహించబోయే ఉత్సవాల వివరాలను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయదశమి సందర్భంగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అక్టోబరు 15 నుంచి 23 వరకు శరన్నవ రాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
అక్టోబర్ 24న విజయదశమి సందర్భంగా సంక్షేపరామాయణ హోమం, పూర్ణాహుతి, మహాపట్టాభిషేకం, దసరా మండపంలో విజయోత్సవం, శమీపూజ, ఆయుధపూజ, శ్రీరామలీలా మహోత్సవాన్ని జరపనున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా 15వతేదీ నుంచి రోజుకో అలంకారంలో లక్ష్మీతాయారు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబరు 15న ఆదిలక్ష్మి, 16న సంతానలక్ష్మి, 17న గజలక్ష్మి, 18న ధనలక్ష్మి, 19న ధాన్యలక్ష్మి, 20న విజయలక్ష్మి, 21న ఐశ్వర్యలక్ష్మి, 22న వీర లక్ష్మి, 23న మహాలక్ష్మిగా అలంకారంలో దర్శనమిస్తారు. అలాగే అక్టోబరు 16 నుంచి 24 వరకు సంక్షేప రామాయణ హవనం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ వైదిక బృందం సభ్యులు తెలిపారు.