రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. శనివారం చేవెళ్ల కేవీఆర్ మైదానంలో కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ… కేంద్రంలో బీజేపీని, తెలంగాణలో బీజేపీకి మద్దతిస్తున్న బీఆర్ఎస్ను గద్దెదించాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను, లోక్ సభ ఎన్నికల్లో మోదీని ఓడించాలన్నారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేశారని, కానీ క్రెడిట్ అంతా ఒక్కరే తీసుకున్నారని కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. ఇక్కడి ప్రజల మనసు తెలిసి సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. ప్రజభీష్టం మేరకే తెలంగాణ ఏర్పడిందన్నారు. కానీ ఈ తొమ్మిదేళ్లలో చేసిందేమీ లేదని, అందుకే కేసీఆర్ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 12 సూత్రాలను అమలు చేస్తామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని తాము నిలబెట్టుకుంటామన్నారు. కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చి, నెరవేరుస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4వేల కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేశారని, ఇటీవల లడఖ్లో బైక్ రైడ్ చేశారని గుర్తు చేశారు. తాను 12 ఎన్నికలలో పోటీ చేసి, 11సార్లు గెలిచానన్నారు. ప్రజాస్వామ్య దేశం వల్లే తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అయ్యానని చెప్పారు. దేశ ఐక్యతకు కృషి చేస్తూ ఇందిర, రాజీవ్లు ప్రాణాలు వదిలారన్నారు. నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలిసి చిన్నచిన్న రాజ్యాలను కలిపారన్నారు.
కేంద్రంలో ప్రధాని మోడీ సర్కార్ను ఓడించేందుకు 26 పార్టీలు ఒక్కటయ్యాయన్నారు. బీజేపీని ఓడించేందుకు సెక్యులర్ పార్టీలు ఏకమయ్యాయని, పాట్నా, బెంగళూరులలో I.N.D.I.A. కూటమి సమావేశాలు జరిగాయని, త్వరలో ముంబైలో జరుగుతున్నాయన్నారు. బీజేపీతో పాటు తెలంగాణలో కేంద్రానికి అండగా ఉన్న కేసీఆర్ను కూడా తెలంగాణలో ఓడించాల్సి ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. అందుకే నేరుగా బీఆర్ఎస్ పైన బీజేపీ గట్టిగా విమర్శలు చేయడం లేదన్నారు. ఈ పార్టీలు బయట తిట్టుకుంటాయని, లోపల మంతనాలు జరుపుకుంటాయన్నారు.









