మల్కాజిగిరి నుంచి మైనంపల్లిని తప్పించే అవకాశం
మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి తాజాగా విజయశాంతి పేరు వినిపిస్తోంది. విజయశాంతి అంటే.. మాజీ ఎంపీ, బీజేపీ మహిళా నేత అనుకునేరు.. కాదండోయ్.! ఈమె పేరు కూడా విజయశాంతి అంతే. మాజీ ఎమ్మెల్యే చింతల కనాకరెడ్డి కోడలే చింతల విజయశాంతి 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అల్వాల్ నుంచి పోటీచేసి ఘన విజయం సాధించారు. అంతేకాదు.. ఈమే మేయర్ బరిలో కూడా నిలిచారు. జీహెచ్ఎంసీ మేయర్ జనరల్ మహిళకు కేటాయించడంతో విజయశాంతి కూడా ‘నువ్వా–నేనా’ అన్నట్లుగా తలపడ్డారు. అయితే.. చివరికి తన అత్యంత ఆప్తుడు అయిన కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మికే ఓటేశారు కేసీఆర్. సరిగ్గా ఇప్పుడు సువర్ణావకాశం రానే వచ్చిందని.. మల్కాజిగిరి బరిలోకి దిగడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్, కేటీఆర్తో పాటు హరీష్, కవితకు కూడా కార్పొరేటర్ కుటుంబ సభ్యులు చర్చించారని తెలిసింది. అయితే కేసీఆర్ కూడా విజయశాంతి వైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా సమాచారం.
సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు సీటు లభించింది. అయితే మైనంపల్లి తనకే కాకుండా తన కుమారుడికి కూడా సీటు (మెదక్ నుంచి) కావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ మేనల్లుడు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారితీశాయి. ఆయన అంతు చూసేవరకు వదలబోనని.. సిద్దిపేటలో హరీశ్ పతనం చూస్తానని మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మైనంపల్లిపై బీఆర్ఎస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి సీటును వేరే వారికి కేటాయిస్తారని అంటున్నారు. ఈ క్రమంలో ఆల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి పేరు మల్కాజిగిరి స్థానానికి వినిపిస్తోంది.