మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనను ఖండిస్తూ ములుగులో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనలో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలపై జరిగిన ఘటనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. మణిపూర్లో మహిళలపై జరిగిన అమానవీయ ఘటనకు బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అక్కడ జరుగుతున్న ప్రతి మారణ హోమం వెనుక మోదీ ప్రభుత్వ హస్తం ఉందని, 50 వేల మంది పోలీసులు ఉన్నా.. మణిపూర్ రాష్ట్రంలో మహిళలకు, మానవ హక్కులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.
మహిళలను అత్యంత కిరాతకంగా హింసించిన దోషులను కాపాడడం కోసమే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీతక్క విమర్శించారు. ఆదానీ, అంబానీ ఆస్తులను కాపాడుకోవడం కోసం చేస్తున్న కుట్రలో భాగంగానే బీజేపీ ప్రభుత్వం ఓట్ల రాజకీయం మణిపూర్లో చేస్తుందన్నారు. మణిపూర్లో జరుగుతున్న అల్లర్లపై ప్రధాని మోదీ పెదవి విప్పకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ ప్రభుత్వం వెంటనే మణిపూర్లో ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేయాలని తెలిపారు. మణిపూర్లో ఉన్న గవర్నర్ మహిళ అయి ఉండి కూడా కార్పొరేట్ అల్లర్లపై నోరు మెదపకపోవడం దారుణమని సీతక్క విమర్శించారు.









