కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ప్రజా నాయకులు ఉమెన్ చాందీ, ఆయన మరణం కేరళకు తీరని లోటన్నారు. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా, నాలుగు సార్లు మంత్రిగా, 12 సార్లు ఎమ్మెల్యేగా దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో వివిధ హోదాలలో చాందీ పని చేశారన్నారు. ఆయన మరణం కేరళ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన మృతి పట్ల రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
చాందీ మరణం దురదృష్టకరం.. భట్టి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మరణం అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. 79 ఏళ్ల ఉమెన్ చాందీ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఆర్థిక మంత్రి వంటి కీలక పదవులను నిర్వహించారన్నారు. ఉమెన్ చాందీ మరణం కేరళ రాష్ట్రానికేకాక యావత్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. రాజకీయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ చిరునవ్వుతో వాటికి పరిష్కారం కనుగొనే నాయకుడిగా కేరళ ప్రజలు ఆయనను గుర్తిస్తారని తెలిపారు.









