మహారాష్ట్రలోని బుల్దానా సమీపంలో చాలా దారుణం జరిగింది. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై ప్రయాణిస్తున్న ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురికావడంతో 25 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సులో 33 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిని బుల్దానా సివిల్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ బాబూరావు మహాముని మీడియాకు తెలిపారు.
నాగపూర్ నుంచి శుక్రవారం రాత్రి బయల్దేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పుణే వెళ్తుండగా, శుక్ర-శనివారం మధ్య రాత్రి రెండు గంటల సమయంలో బుల్దానా జిల్లాలోని సింఖేద్రజ సమీపంలో డివైడర్ను ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారని, 25 మంది ప్రాణాలు కోల్పోయారని, గాయపడినవారిని బుల్దానా సివిల్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నామని తెలిపారు.
బుల్దానా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ కడస్నే మాట్లాడుతూ, ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ బస్సు టైరు పేలిపోవడంతో ఓ స్తంభానికి ఢీకొట్టిందని, అనంతరం డివైడర్ను ఢీకొట్టడంతో బస్సు తలక్రిందులైందని, వెంటనే అగ్నిప్రమాదానికి గురైందని చెప్పారు. ఈ బస్సు డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలిపారు.
అమిత్ షా ప్రగాఢ సంతాపం
ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. గాయపడినవారికి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. ‘‘మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయవిదారకం. ఈ భయానక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ఈ విషాద సమయంలో సంఘీభావం తెలుపుతున్నాను. గాయపడినవారికి ప్రభుత్వ యంత్రాంగం సత్వర చికిత్స అందిస్తోంది. గాయపడినవారు వేగంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి
బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.









