మెగా ఫ్యామిలీలో శుక్రవారం వేడుక జరుగుతోంది. రామ్చరణ్ (Ram charan) – ఉపాసన (Upasana) దంపతుల ముద్దుల పుత్రిక బారసాల చిరంజీవి నివాసంలో జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్ల వీడియోను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అయితే తాజాగా మరో వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) ఇటీవల బంగారు ఊయలను కానుకగా పంపించారని.. అందులోనే చిరంజీవి మనవరాలు క్రెడిల్ సెర్మనీ చేయబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై రామ్చరణ్ టీమ్ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని టీమ్ తెలిపింది. ప్రజ్వల ఫౌండేషన్ వాళ్లు సిద్థం చేసిన చెక్క ఉయ్యాలనే ఈ వేడుకల్లో ఉపయోగిస్తునట్లు తెలిపారు. (prajwala Foundation)
ఇటీవల ప్రజ్వల సంస్థలోని పలువరు మహిళలు రామ్చరణ్ దంపతులకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ ఉయ్యాలను తయారు చేశారు. ఎలాంటి మెషీన్ ఉపయోగించుండా చేతితోనే ఈ ఉయ్యాల తయారు చేయడం ప్రత్యేకత. ఈ విషయాన్ని ఉపాసన కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రజ్వల ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘చేతితో తయారు చేసిన ఈ ఉయ్యాలకు ప్రాముఖ్యత ఉంది. బలం, ఆశకు ఇది ప్రతీక’’ అని ఉపాసన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే!
అయితే ఈ రోజు చిరు మనవరాలిని ఉయ్యాలలో వేయడంతోపాటు మెగా ప్రిన్సెస్కు నామకరణం కూడా చేస్తారని టాక్ వినిపిస్తోంది. రామ్చరణ్ మాత్రం సంప్రదాయం ప్రకారం 21వ రోజున పేరు పెడతామని, ఇప్పటికే పాపకు ఓ పేరు అనుకున్నట్లు ఉపాసన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సందర్భంలో చెప్పారు.









